Torch Procession in Yadagiriguttta | విద్యార్థులకు సంఘీభావంగా గుట్టలో కాగడాల ర్యాలి


  • నీట్ విద్యార్థులకోసం కాగడాల ర్యాలి చేసిన అయిలన్న 
  • విద్యార్థులపై లాఠీచార్జికి నిరసన
  • కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు 

ఢిల్లీలో నీట్ విద్యార్థులపై జరిగిన లాఠీచార్జికి నిరసనగా యాదగిరిగుట్టలో భారీ కొవ్వొత్తుల, కాగడాల ర్యాలీ నిర్వహించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య.

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పాదాల (వైకుంఠ ద్వారం) వద్ద నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీదుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో కొవ్వొత్తులు, కాగడాలతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఢిల్లీలో నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ నేపథ్యంలో ఆందోళన చేపట్టిన విద్యార్థులపై జరిగిన లాఠీచార్జికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, విద్యార్థులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, దేశ యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని, తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పేపర్ లీకేజీలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయడం అత్యంత దురదృష్టకరమని, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.

విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సహించదని స్పష్టం చేశారు.విద్యార్థుల భవిష్యత్తును కాపాడేలా పారదర్శకమైన పరీక్షల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీర్ల ఐలయ్య డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

#jantharmanthar #cjp #studentprotest #congress #beerlaailaiah #yadagirigutta #yadadri

Comments