Yadadri Giri Pradakshina | యాదగిరిగుట్టలో వైభవంగా గిరి ప్రదక్షిణ

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఆధ్యాత్మిక వైభవం నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారికి తమ భక్తిని చాటుకున్నారు.

గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు శ్రీ స్వామివారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దంపతులు, ఆలయ కార్యనిర్వాహణాధికారి (ఈవో) భవాని శంకర్ ప్రత్యేక పూజల్లో పాల్గొని గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణల మధ్య కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో సాగింది.



ఈ సందర్భంగా స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయం ముఖ మండపంలో శతఘటాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాల నడుమ శతఘటాలతో శ్రీ స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు సమర్పించారు. ఈ పవిత్ర సేవలో పాల్గొన్న భక్తులు స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థనలు చేశారు.

గిరి ప్రదక్షిణలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. "జై లక్ష్మీ నరసింహ" నినాదాలతో కొండచుట్టూ ప్రదక్షిణ చేస్తూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తాగునీరు, వైద్యసేవలు, భద్రత, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేశారు.

గిరి ప్రదక్షిణ అనంతరం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దంపతులు మరియు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ దంపతులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి స్వామివారి ఆశీస్సులు ప్రసాదించారు.

ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహణాధికారి భవాని శంకర్ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దంపతులకు, గోరంట్ల మాధవ్ దంపతులకు శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం మరియు ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు.

స్వాతి నక్షత్రం సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణ, శతఘటాభిషేకం, ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధల మధ్య విజయవంతంగా ముగియగా, యాదగిరిగుట్ట క్షేత్రం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించగా, కార్యక్రమాలు ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించబడ్డాయి.

Yadadri Giri Pradaxina | #yadadri | #Yadagirigutta #telangana

Comments